యూజర్ల కోరిక నెరవేర్చిన బ్లింకిట్.. కొత్త ఫీచర్ వచ్చేసింది!

  • బ్లింకిట్ నుంచి యూజర్ల కోసం సరికొత్త ఫీచర్
  • ఆర్డర్ ప్లేస్ చేశాక కూడా కొత్త వస్తువులు యాడ్ చేసుకునే సౌలభ్యం
  • అదనపు ఐటమ్స్‌కు డెలివరీ ఛార్జీలు ఉండవు
  • కొత్త ఫీచర్‌ను ప్రకటించిన సీఈఓ అల్బీందర్ దిండ్సా
క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ తమ యూజర్ల కోసం ఓ అద్భుతమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన తర్వాత ఏదైనా వస్తువును మర్చిపోతే, ఇకపై కొత్త ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేకుండా, పాత ఆర్డర్‌కే ఆ వస్తువును యాడ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. దీనివల్ల యూజర్లు అదనపు డెలివరీ ఛార్జీలు చెల్లించాల్సిన పని ఉండదు.

ఈ కొత్త ఫీచర్ వివరాలను బ్లింకిట్ సీఈఓ అల్బీందర్ దిండ్సా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎంతోమంది కస్టమర్లు ఈ ఫీచర్ కోసం అభ్యర్థించారని, వారి కోరిక మేరకే దీన్ని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే, ముందు చేసిన ఆర్డర్‌ను ప్యాక్ చేసేలోపు మాత్రమే కొత్త వస్తువులను యాడ్ చేసుకునేందుకు వీలుంటుంది.

"మీరు ఆర్డర్ చేసిన తర్వాత కూడా మరిన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్డర్ ప్యాకింగ్ చేసేలోపు మీరు కొత్త ఐటమ్స్ యాడ్ చేస్తే, వాటికి అదనపు డెలివరీ ఛార్జీలు ఉండవు. ఏదైనా వస్తువు మర్చిపోయినప్పుడు మీరు రెండో ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదు" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపరచడానికి కస్టమర్ల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నట్లు కూడా తెలిపారు.

గత కొన్ని నెలల్లో బ్లింకిట్ తీసుకొచ్చిన రెండో కీలక ఫీచర్ ఇది. గత ఆగస్టులో చిన్న వయసు వారు కొన్ని రకాల వస్తువులను ఆర్డర్ చేయకుండా నిరోధించేందుకు ‘పేరెంటల్ కంట్రోల్స్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లకు మరింత సౌలభ్యం కల్పిస్తూ, దేశంలోని ప్రధాన నగరాల్లో తమ ఆదరణను పెంచుకుంటోంది.


More Telugu News