బెంగళూరు సొసైటీలో బ్యాచిలర్స్‌కు షాక్.. ఇంటికి అమ్మాయిలు వచ్చారని రూ.5000 ఫైన్

  • ఇద్దరు అమ్మాయిలు రాత్రి బస చేశారని బ్యాచిలర్స్‌కు రూ.5000 జరిమానా
  • బెంగళూరులోని ఓ హౌసింగ్ సొసైటీ వింత నిబంధనపై నెట్టింట చర్చ
  • బ్యాచిలర్స్‌కు మాత్రమే గెస్టులపై ఆంక్షలు.. కుటుంబాలకు మినహాయింపు
  • సొసైటీ తీరుపై నెటిజన్ల ఆగ్రహం.. చట్టపరంగా వెళ్లాలని సూచనలు
నగరాల్లో నివసించే బ్యాచిలర్స్‌కు ఎదురయ్యే ఇబ్బందులను కళ్లకు కట్టేలా ఓ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. ఇద్దరు యువతులు రాత్రిపూట తమ ఫ్లాట్‌లో బస చేశారన్న కారణంతో ఓ హౌసింగ్ సొసైటీ ఇద్దరు బ్యాచిలర్స్‌కు ఏకంగా రూ.5,000 జరిమానా విధించింది. ఈ ఘటనపై బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే... బెంగళూరుకు చెందిన ఓ యువకుడు తన ఫ్లాట్‌మేట్‌తో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. అక్టోబర్ 31, 2025 రాత్రి ఇద్దరు యువతులు వారి ఫ్లాట్‌లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న సొసైటీ యాజమాన్యం, నిబంధనలు ఉల్లంఘించారంటూ వారికి రూ.5,000 ఫైన్ వేసింది. దీనికి సంబంధించిన ఇన్‌వాయిస్‌లో "ఇద్దరు అమ్మాయిలు రాత్రి బస చేశారు" అని స్పష్టంగా పేర్కొంది.

ఈ అన్యాయంపై ఆ యువకుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. "మా సొసైటీలో బ్యాచిలర్స్‌ రాత్రిపూట అతిథులను అనుమతించకూడదనే నిబంధన ఉంది. కానీ, ఇదే రూల్ కుటుంబాలకు వర్తించదు. మేం కూడా అందరిలాగే మెయింటెనెన్స్ చెల్లిస్తున్నా మాపై ఈ వివక్ష ఎందుకు? కనీసం ఓ హెచ్చరిక కూడా ఇవ్వకుండా నేరుగా జరిమానా విధించారు" అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు త‌మ‌దైన‌ శైలిలో స్పందిస్తున్నారు. చాలా మంది సొసైటీ తీరును తప్పుబడుతూ, వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేయాలని సూచించారు. "ఇది మన దేశంలో ఉన్న సాంస్కృతిక సమస్య" అని ఒకరు వ్యాఖ్యానించగా, "ఇలాంటి నిబంధనలు చట్టవిరుద్ధం, కోర్టుకు వెళ్లవచ్చు" అని మరొకరు సలహా ఇచ్చారు. అయితే, తన ఫ్లాట్‌మేట్ విషయం గమనించకుండా ఇప్పటికే ఆ జరిమానా చెల్లించేశాడని బాధితుడు తెలపడం గమనార్హం. ఈ ఘటనతో నగరాల్లో బ్యాచిలర్స్‌ ఎదుర్కొంటున్న వివక్షపై మరోసారి చర్చ మొదలైంది.




More Telugu News