బీడీ, చుట్ట కార్మికులకు భరోసా.. పెరిగిన వేతనాలు, తగ్గిన పని గంటలు

  • బీడీ, చుట్ట కార్మికులకు వర్తించనున్న కొత్త కార్మిక చట్టాలు
  • రోజువారీ పని గంటలు 8కి తగ్గింపు.. వారానికి 48 గంటల పరిమితి
  • ఓవర్ టైమ్ చేస్తే రెట్టింపు వేతనం చెల్లించడం తప్పనిసరి
  • అందరికీ కనీస వేతన హామీ.. వలసల నివారణకు ఫ్లోర్ వేజ్ విధానం
దేశంలోని బీడీ, చుట్ట కార్మికుల సంక్షేమం దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కొత్తగా అమలులోకి వచ్చిన కార్మిక చట్టాల (లేబర్ కోడ్స్) ద్వారా ఈ రంగంలోని కార్మికులకు మెరుగైన వేతన భద్రత, సామాజిక భద్రత, సురక్షితమైన పని వాతావరణం కల్పిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నూతన సంస్కరణలతో ఈ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించ‌డం ద్వారా కార్మికుల జీవనోపాధికి స్థిరత్వం లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

గతంలో ఉన్న 1966 నాటి చట్టం ప్రకారం కార్మికులకు పరిమిత రక్షణ మాత్రమే ఉండేది. రోజువారీ పని గంటలు 9 వరకు ఉండగా, వేతనంతో కూడిన వార్షిక సెలవు పొందాలంటే క్యాలెండర్ సంవత్సరంలో 240 రోజులు పనిచేయాల్సి వచ్చేది. వారికి ఎలాంటి వైద్య పరీక్షల సౌకర్యం కూడా ఉండేది కాదు. అయితే, కొత్తగా వచ్చిన ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ (OSHWC) కోడ్, 2020 ఈ లోపాలను సరిదిద్దింది.

తాజా నిబంధనల ప్రకారం రోజువారీ పని గంటలను 8 గంటలకు పరిమితం చేశారు. వారానికి 48 గంటల పని పరిమితిని కొనసాగించారు. నిర్ణీత సమయం కంటే అదనంగా పనిచేస్తే (ఓవర్ టైమ్) సాధారణ వేతనానికి రెట్టింపు చెల్లించడం తప్పనిసరి చేశారు. ఇకపై 180 రోజులు పనిచేస్తేనే వేతనంతో కూడిన వార్షిక సెలవుకు అర్హత లభిస్తుంది. దీంతోపాటు, ఉద్యోగులకు ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు (హెల్త్ చెకప్) చేయించాలని కూడా కొత్త చట్టం స్పష్టం చేస్తోంది.

అంతేకాకుండా ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతనం కంటే తక్కువ ఏ ఉద్యోగికి చెల్లించరాదని కొత్త చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో షెడ్యూల్డ్ ఉద్యోగులకు మాత్రమే వర్తించే ఈ నిబంధన, ఇప్పుడు అందరికీ వర్తిస్తుంది. కార్మికుల వలసలను తగ్గించే ఉద్దేశంతో కనీస జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఫ్లోర్ వేజ్‌ను నిర్ణయిస్తుంది. ఈ కొత్త చట్టాలు కార్మికులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే కాకుండా, వారి జీవితాలకు గౌరవప్రదమైన భరోసా కల్పిస్తాయని ప్రభుత్వం వివరించింది.


More Telugu News