తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు

  • కపిలతీర్థం వద్ద ఉన్న రెండు హోటళ్లకు బెదిరింపులు
  • రంగంలోకి దిగిన బాంబు, డాగ్ స్క్వాడ్‌ బృందాలు
  • ఇటీవలే కలెక్టరేట్, టీటీడీకి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చిన వైనం
ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపారు. దీంతో హోటళ్ల యాజమాన్యాలు తీవ్ర ఆందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించాయి.

వివరాల్లోకి వెళితే, తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలో ఉన్న రెండు హోటళ్లకు బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్స్ అందాయి. ఈ సమాచారం అందుకున్న హోటళ్ల నిర్వాహకులు అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆయా హోటళ్లకు చేరుకున్నారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. అయితే, అక్కడ ఎలాంటి బాంబులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కొన్ని రోజుల క్రితమే తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యాలయం, రైల్వే స్టేషన్‌కు కూడా ఇలాగే ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. అప్పుడు కూడా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇప్పుడు మళ్లీ హోటళ్లను లక్ష్యంగా చేసుకోవడంతో ఇది ఆకతాయిల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై పోలీసులు దృష్టి సారించారు.


More Telugu News