బెంగళూరు ట్రాఫిక్ సమస్య, పోలీసులపై ఎస్పీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

  • నగర పోలీసులు యూజ్‌లెస్ అంటూ సమాజ్‌వాది పార్టీ ఎంపీ వ్యాఖ్య
  • బెంగళూరు నగర ట్రాఫిక్ అత్యంత దారుణంగా ఉందన్న ఎంపీ రాజీవ్ రాయ్
  • వాహనాల రద్దీని క్లియర్ చేయడానికి ఒక్క పోలీసు కనిపించలేదని వ్యాఖ్య
కర్ణాటక రాజధాని బెంగళూరు నగర రహదారులు, ట్రాఫిక్ జామ్‌లపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర పోలీసులను 'యూజ్‌లెస్' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగర ట్రాఫిక్ సమస్యపై సామాజిక మాధ్యమ వేదికగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి తీసుకువెళ్లారు.

బెంగళూరు నగర ట్రాఫిక్ అత్యంత దారుణంగా ఉందని, ఇక్కడి పోలీసులు నిష్ప్రయోజకులని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఆదివారం తాను ఢిల్లీ బయలుదేరగా, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయినట్లు తెలిపారు. వాహనాల రద్దీని క్లియర్ చేయడానికి రహదారిపై ఒక్క పోలీసు కూడా కనిపించలేదని విమర్శించారు.

విమానాశ్రయానికి సమయానికి చేరుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరు పోలీసులను తాను సంప్రదించానని, కానీ వారు స్పందించలేదని ఆరోపించారు. బెంగళూరులో ట్రాఫిక్ నిర్వహణ సరిగ్గా లేదని ఆయన అన్నారు. అందమైన నగరంగా ప్రఖ్యాతి గాంచిన బెంగళూరు అసమర్థ అధికారుల కారణంగా అపఖ్యాతిని మూటగట్టుకుంటోందని అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ విభాగం పట్టించుకోవడం లేదని, దీంతో అందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.

Rajeev Rai
Bangalore traffic
Karnataka
traffic jam
Bengaluru police
Siddaramaiah
SP MP
airport

More Telugu News