యుద్ధం నుంచి పారిపోతే మనుగడ లేదు: ప్రశాంత్ కిశోర్‌పై రామ్ మాధవ్ ఫైర్

  • ప్రశాంత్ కిశోర్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై విమర్శలు
  • రాహుల్ గాంధీని ప్రజలు సీరియస్‌గా తీసుకోలేదని ఎద్దేవా
  • బీహార్ ఓటర్ల జాబితాలో 65 లక్షల బోగస్ ఎంట్రీల తొలగించామని వెల్లడి
జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత రామ్ మాధవ్ తీవ్ర విమర్శలు చేశారు. యుద్ధ భూమి నుంచి తప్పుకునే ఏ పార్టీకి రాజకీయంగా మనుగడ ఉండదని ఆయన అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్టీని ఏర్పాటు చేసి, తాను ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రశాంత్ కిశోర్ తీసుకున్న నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని రామ్ మాధవ్ అన్నారు. ఏ నాయకుడైనా యుద్ధం నుంచి పారిపోతే, ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఇక రాహుల్ గాంధీని దేశంలో ఎవరూ సీరియస్‌గా తీసుకోరని, ఆయన చేసిన 'ఓట్ చోర్' ఆరోపణలను కూడా బీహార్ ప్రజలు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ఒకవేళ ప్రజలు ఆయన మాటలు నమ్మి ఉంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై మాట్లాడుతూ, ఇది పూర్తిగా ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశమని, ప్రభుత్వానికి కాదని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా బీహార్‌లో 65 లక్షల నకిలీ, బోగస్ ఓట్లను గుర్తించి తొలగించామని తెలిపారు. దీనివల్ల నిజమైన ఓటర్లకు ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ కేవలం భారతదేశం పరిధిలోనే పనిచేస్తుందని, సంస్థకు సంబంధించిన ప్రతి పైసా ఆడిట్ చేయబడుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 243 స్థానాలకు గాను 202 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 


More Telugu News