ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం.. 26 జిల్లాలకు విస్తరించిన జ్వరాలు!

  • రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న స్క్రబ్ టైఫస్ కేసులు
  • నల్లిలాంటి కీటకం కుట్టడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందంటున్న వైద్యులు 
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 379 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో 'స్క్రబ్ టైఫస్' జ్వరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఈ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నల్లిని పోలిన ఒక చిన్న కీటకం (ట్రాంబికులిడ్ మైట్) కుట్టడం ద్వారా 'ఓరియంటియా సుట్టుగముషి' అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఈ వ్యాధికి కారణమవుతుంది.

ఈ కీటకం కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడి, దద్దుర్లు వస్తాయి. వారం, పది రోజుల తర్వాత జ్వరం, వణుకు, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటపడతాయి. అయితే చాలామంది దీనిని సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోకపోతే, అది తీవ్ర శ్వాసకోశ సమస్యలు, మెదడువాపు, మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉంది.

రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 379 కేసులు నమోదు కాగా, కాకినాడ (141), విశాఖపట్నం (123) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కేసులు వెలుగుచూశాయి. సాధారణ యాంటీబయాటిక్స్‌తోనే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, అయితే అవగాహన లేకపోవడమే సమస్యకు కారణమని వైద్యులు చెబుతున్నారు. జ్వరం తగ్గకుండా ఉండి, శరీరంపై నల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి 'ఎలీసా' పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో అనుమానిత కేసులు ఎక్కువగా నమోదవుతున్నా, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కేవలం విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి ప్రధాన నగరాల్లోని ఆసుపత్రులకే పరిమితమయ్యాయి. దీంతో వ్యాధి వ్యాప్తిని సకాలంలో గుర్తించడం కష్టమవుతోంది. అన్ని ప్రాంతాల్లో పరీక్షా సౌకర్యాలు పెంచి, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తే వ్యాధిని త్వరగా నియంత్రించే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


More Telugu News