Chandrababu: ఏపీ అభివృద్ధి.. ప్రజా ప్రయోజనాలే అజెండా: టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Directs MPs on AP Development Agenda
షార్ట్స్‌లో చూడండి
రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అత్యధిక యువ పార్లమెంటేరియన్లు టీడీపీలోనే ఉన్నారని, ఈ యువశక్తిని ఉపయోగించి పార్లమెంటు వేదికగా రాష్ట్ర సమస్యలను బలంగా వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మొంథా తుపాన్ నష్టపరిహారం, కృష్ణా-గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహకారం వంటి అంశాలపై కేంద్రాన్ని ఒప్పించేలా ఎంపీలు కృషి చేయాలని సూచించారు. 2027 జూన్‌లో పోలవరాన్ని జాతికి అంకితం చేయడమే లక్ష్యమని, దీనికి కేంద్రం తోడ్పాటు అత్యవసరమని స్పష్టం చేశారు. వంశధార-గోదావరి-నల్లమల సాగర్ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, నీటి భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. పత్తి, మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, వారికి ఉపశమనం కలిగించాలని ఆదేశించారు.

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను కూడా సీఎం ప్రస్తావించారు. విశాఖ-విజయవాడ మెట్రో రైలు, భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై కేంద్రంతో చురుగ్గా చర్చలు జరపాలని అన్నారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని స్పష్టం చేశారు. అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజాసేవపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

ప్రశ్నల్లో ప్రజాహితమే ముఖ్యం: లోకేశ్‌
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మాట్లాడుతూ, పార్లమెంటులో అడిగే ప్రశ్నలు ప్రజా ప్రయోజనకరంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు.

Go Back to Shorts
Chandrababu
Andhra Pradesh
AP Development
Polavaram Project
Krishna Godavari Rivers
Special Status
Vizag Steel Plant
Bhoga puram Airport
Nara Lokesh
TDP MPs

More Telugu News