బడా బాబుల స్విస్ ఖాతాలపై ఉక్కుపాదం.. రూ. 29 వేల కోట్ల ఆస్తులు గుర్తింపు

  • విదేశాల్లో రహస్య ఆస్తులు కూడబెట్టిన 24,678 మందిని గుర్తించిన ఐటీ శాఖ
  • వీరి ఆస్తుల విలువ రూ. 29,208 కోట్లుగా అంచనా
  • అంతర్జాతీయ ఒప్పందాలతో బడా బాబుల గుట్టురట్టు
  • డిసెంబర్ వరకు ఐటీ శాఖ డెడ్‌లైన్
  • తప్పితే 30 శాతం పన్ను.. రూ.10 లక్షల జరిమానా
విదేశాల్లో రహస్యంగా ఆస్తులు కూడబెట్టిన వారికి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఉచ్చు బిగిస్తోంది. స్విట్జర్లాండ్‌తో సహా పలు దేశాలతో కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందం (AEOI) ఆధారంగా విదేశాల్లో లెక్కచూపని ఆస్తులు కలిగిన 24,678 మందితో కూడిన జాబితాను ఐటీ శాఖ సిద్ధం చేసింది. వీరికి విదేశాల్లో సుమారు రూ.29,208 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఆస్తులతో పాటు వీరు దాదాపు రూ.1,089.88 కోట్ల విదేశీ ఆదాయాన్ని కూడా తమ ఐటీ రిటర్న్‌లలో చూపలేదని అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి అందిన సమాచారాన్ని, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైల్ చేసిన రిటర్న్‌లతో పోల్చి చూడటం ద్వారా ఈ బడా బాబుల గుట్టు రట్టయింది. ఈ జాబితాలో పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉన్నతోద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లోగా సవరించిన ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయాలంటూ త్వరలోనే వీరందరికీ ఎస్ఎంఎస్‌లు, ఈమెయిళ్ల ద్వారా ఐటీ శాఖ హెచ్చరికలు జారీ చేయనుంది. గడువులోగా స్పందించని వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అటువంటి వారిపై 30 శాతం పన్ను విధించడంతో పాటు చెల్లించాల్సిన పన్నుపై అదనంగా రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


More Telugu News