హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్ .. హాజరుకాకుంటే వారెంట్

  • బతుకమ్మకుంట భూవివాదంలో కోర్టుకు హాజరుకానందుకు కమిషనర్ రంగనాథ్‌పై ఆగ్రహం
  • డిసెంబర్ 5 లోపు విచారణకు రావాలని ఆదేశం
  • హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామన్న హైకోర్టు 
బతుకమ్మకుంట భూ వివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహరించిన తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 5వ తేదీలోగా స్వయంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బతుకమ్మకుంటలోని ఒక ప్రైవేట్ స్థలంలో ఎలాంటి మార్పులు చేయవద్దని ఈ ఏడాది జూన్ 12న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆ ఆదేశాలను ఉల్లంఘించారని ఎడ్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఏవీ రంగనాథ్‌ను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

గురువారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా, ఏవీ రంగనాథ్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నిర్దేశించిన గడువులోగా విచారణకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 


More Telugu News