Digital Arrest Scam: 'డిజిటల్ అరెస్ట్' ముఠా సభ్యులు దొరికారు!

Digital Arrest Scam Busted by Bhimavaram Police
  • 'డిజిటల్ అరెస్ట్' పేరుతో మోసం చేస్తున్న అంతర్జాతీయ ముఠా అరెస్ట్
  • విశ్రాంత ప్రొఫెసర్ నుంచి రూ.78 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
  • 14 మంది ముఠా సభ్యుల్లో 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రూ.42 లక్షల నగదు స్వాధీనం, మరో రూ.19 లక్షల ఖాతాలు ఫ్రీజ్
  • అనుమానిత కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచన
‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టును పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు రట్టు చేశారు. సీబీఐ అధికారులమని చెప్పి ఓ విశ్రాంత ప్రొఫెసర్‌ను బెదిరించి, ఆయన ఖాతా నుంచి రూ.78 లక్షలు కాజేసిన కేసులో 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ముంబైకి చెందిన రహతే జె నయన్ పరారీలో ఉన్నాడు.

వివరాల్లోకి వెళితే, విశ్రాంత ప్రొఫెసర్ శర్మకు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, తాము సీబీఐ అధికారులమని పరిచయం చేసుకున్నారు. ఆయన సిమ్ కార్డుతో అక్రమాలు జరిగాయని, ఈ కేసులో మిమ్మల్ని 'డిజిటల్ అరెస్ట్' చేస్తున్నామని నమ్మించారు. బెంగళూరు నుంచి వచ్చిన ఈ ఫోన్ కాల్‌తో మొదలైన మోసం 13 రోజుల పాటు కొనసాగింది. బాధితుడి నుంచి ఆధార్, బ్యాంకు వివరాలు సేకరించి, విడతలవారీగా మొత్తం రూ.78 లక్షలు దోచుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసును సవాలుగా స్వీకరించిన భీమవరం పోలీసులు ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ గాలింపు చర్యలు చేపట్టి 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో కొందరు టెక్నాలజీ నిపుణులు కాగా, ఏడుగురు గతంలో కంబోడియాలో పనిచేసిన అనుభవం ఉన్నవారు. వీరి నుంచి రూ.42 లక్షల నగదును రికవరీ చేయడంతో పాటు, వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న మరో రూ.19 లక్షలను ఫ్రీజ్ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ, ‘డిజిటల్ అరెస్ట్’ అనేది పూర్తిగా బూటకమని, ప్రజలు ఎవరూ ఇలాంటి మాటలు నమ్మవద్దని సూచించారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు, ఒంటరిగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా మోసాలకు పాల్పడుతోందని తెలిపారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Digital Arrest Scam
Bhimavaram Police
Cyber Crime
West Godavari
Online Fraud
CBI
Adnan Nayeem Asmi
Cyber Criminals
Financial Fraud
Scam

More Telugu News