పవన్ కల్యాణ్‌తో లోకేశ్‌ కనగరాజ్ సినిమా?.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

  • భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న కేవీఎన్ ప్రొడక్షన్స్
  • తమిళ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టిన లోకేశ్‌
  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత పవన్ తదుపరి చిత్రం ఇదేనని ప్రచారం
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ సృష్టించుకున్న దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్ ఇప్పుడు తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఆయన ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారనే వార్త ఫిల్మ్‌నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కన్నడలో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు సమాచారం.

‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి చిత్రాలతో గ్యాంగ్‌స్టర్ డ్రామాలను కొత్తగా ఆవిష్కరించిన లోకేశ్‌, ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత రజనీకాంత్-కమల్‌హాసన్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం లోకేశ్‌ ఆ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి, పవన్ కల్యాణ్‌తో సినిమా చేసేందుకే ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ఈ సినిమాలో నటించేందుకు పవన్ కూడా సుముఖంగా ఉన్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత ఆయన మరో ప్రాజెక్ట్‌కు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం లోకేశ్‌ దర్శకత్వంలోనే ఉంటుందన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది. అయితే, ఈ వార్తలపై స్పష్టత రావాలంటే నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


More Telugu News