తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం.. టోకెన్లు ఎలా పొందాలంటే..!

  • డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు
  • సామాన్య భక్తులకు ప్రాధాన్యం.. తొలి మూడు రోజులు సర్వదర్శనానికే
  • వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించిన టీటీడీ
  • మొత్తం 8 లక్షల మందికి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు
  • నవంబర్ 27 నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్ల రిజిస్ట్రేషన్
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే వైకుంఠ ద్వార దర్శనాల తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వారాల ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈసారి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పలు కీలక మార్పులు చేసింది.

దర్శనాల్లో భాగంగా మొదటి మూడు రోజులను (డిసెంబర్ 30, 31, జనవరి 1) పూర్తిగా సర్వదర్శన భక్తులకే కేటాయించారు. ఈ మూడు రోజులకు గాను 1.88 లక్షల సర్వదర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నారు. ఈ మూడు రోజుల్లో మొత్తం 1.88 లక్షల టోకెన్లు DIP (Divya Darshan Incentive Programme) ద్వారా ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నారు. ఇందుకోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుండగా, డిసెంబర్ 2 నుంచి టోకెన్లు అందుబాటులో ఉంటాయి.

మిగిలిన ఏడు రోజుల్లో (జనవరి 2 నుంచి 8 వరకు) ప్రతిరోజూ 15,000 సర్వదర్శన టోకెన్లు, 1,000 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకు వీలుగా వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించారు. మొత్తం 184 గంటల దర్శన సమయంలో 164 గంటలు సర్వదర్శనానికే కేటాయించారు. తొలిరోజు వీఐపీ బ్రేక్‌ను 4 గంటల 45 నిమిషాలకు, ఇతర రోజుల్లో గరిష్ఠంగా 2 గంటలకు పరిమితం చేశారు.

ఈ పది రోజుల్లో సుమారు 8 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చని టీటీడీ భావిస్తోంది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా మాత్రమే టోకెన్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.


More Telugu News