యువ కో పైలట్ పై 60 ఏళ్ల పైలట్ అఘాయిత్యం.. బేగంపేటలో జీరో ఎఫ్ఐఆర్

  • బెంగళూరు ఫైవ్ స్టార్ హోటల్‌లో క్యాబిన్ క్రూపై అత్యాచారం
  • ప్రైవేట్ ఏవియేషన్ సంస్థకు చెందిన 60 ఏళ్ల పైలట్‌పై ఆరోపణలు
  • పొగ తాగుదామని చెప్పి గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యం
  • హైదరాబాద్ బేగంపేటలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బాధితురాలు
  • బెంగళూరు పోలీసులకు కేసు బదిలీ, దర్యాప్తు ప్రారంభం
బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనతో పాటు పనిచేస్తున్న 26 ఏళ్ల కో పైలట్ పై 60 ఏళ్ల పైలట్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్‌ బేగంపేట, ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి నుంచి ఓ ప్రైవేట్ ఏవియేషన్ సంస్థకు చెందిన చార్టర్డ్ విమానంలో పైలట్ రోహిత్ శరన్, బాధితురాలు, మరో సహోద్యోగి గత వారం బెంగళూరు చేరుకున్నారు. నవంబర్ 18న నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశారు. మరుసటి రోజు తిరిగి పుట్టపర్తి వెళ్లాల్సి ఉండగా, విశ్రాంతి కోసం హోటల్‌లో గదులు తీసుకున్నారు.

అదే రోజు రాత్రి, పొగ తాగే నెపంతో రోహిత్ శరన్ తన గది వద్దకు బాధితురాలిని పిలిచాడని, ఆ తర్వాత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తర్వాత నవంబర్ 20న బేగంపేట నుంచి వచ్చిన ఆమె వెంటనే ఏవియేషన్ సంస్థ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బేగంపేట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును తదుపరి విచారణ నిమిత్తం బెంగళూరులోని హలసూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 63 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News