పెళ్లి తర్వాత మరింత స్పీడ్.. కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్న కీర్తి సురేశ్
- దర్శకత్వంపై ఆసక్తిని బయటపెట్టిన కీర్తి సురేశ్
- సొంతంగా ఓ కథను సిద్ధం చేస్తున్నానని వెల్లడి
- డీప్ఫేక్ వీడియోలపై ఆందోళన, కఠిన చట్టాలు అవసరమన్న నటి
పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ నెమ్మదిస్తుందనే అభిప్రాయాన్ని కీర్తి సురేశ్ పూర్తిగా మార్చేశారు. వివాహం తర్వాత కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాను మహానటిగా వెండితెరపై ఆవిష్కరించిన సావిత్రి కూడా దర్శకురాలు కావడం, ఇప్పుడు కీర్తి కూడా అదే బాటలో పయనించాలని అనుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నటిస్తూనే దర్శకత్వం చేయడం అంత సులభం కాకపోయినా, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఇదే సమయంలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తన భర్త సినిమాల్లోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. "ఆయనకు నటనపై ఆసక్తి లేదు, నాతో నటించే ఛాన్స్ లేదు" అని నవ్వుతూ చెప్పారు. ఇదిలా ఉండగా, ఇటీవల తనను, నటి సమంతను లక్ష్యంగా చేసుకుని వచ్చిన డీప్ఫేక్ వీడియోపై కీర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సైబర్ నేరాల నుంచి మహిళలను కాపాడేందుకు విదేశాల్లో ఉన్నట్లుగా మన దేశంలోనూ కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.