ఇళయరాజా ఫోటో వినియోగంపై మద్రాస్ హైకోర్టు నిషేధం.. కీలక ఆదేశాల జారీ

  • ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాలో అనుమతి లేకుండా వాడొద్దని ఆదేశం
  • ఏఐతో తన ఫోటోను మార్ఫింగ్ చేసి వాడుకుంటున్నారని పిటిషన్
  • వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోందని కోర్టుకు తెలిపిన ఇళయరాజా
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు మద్రాస్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి సోషల్ మీడియా వేదికలపై అనుమతి లేకుండా తన ఫోటోను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. తన ఫోటోను కొందరు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ఇది తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ ఇళయరాజా హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ సాయంతో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి, తద్వారా ఆదాయం పొందుతున్నారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. ఇకపై తన అనుమతి లేకుండా ఎవరూ తన ఫోటోను వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సెంథిల్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం, ఇళయరాజా వాదనలతో ఏకీభవించింది. ఆయన అనుమతి లేకుండా ఫోటోలను సోషల్ మీడియాలో వినియోగించరాదని స్పష్టం చేస్తూ తాత్కాలిక నిషేధం విధించింది. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది.


More Telugu News