ముగిసిన రిమాండ్.. మద్యం కేసు నిందితులకు మరోసారి చుక్కెదురు

  • ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
  • డిసెంబర్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు
  • నిందితులను కోర్టు నుంచి జైళ్లకు తరలించిన అధికారులు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియడంతో, అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం, డిఫాల్ట్ బెయిల్ పొందిన వారిని మినహాయించి మిగతా నిందితులందరికీ డిసెంబర్ 5 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకుముందు, ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డి, అనిల్ చోక్రా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్‌ నాయుడు, బూనేటి చాణక్యను విజయవాడ జిల్లా జైలు నుంచి ఏసీబీ కోర్టుకు తరలించారు. మరో ఇద్దరు నిందితులు నవీన్ కృష్ణ, బాలాజీ కుమార్ యాదవ్‌ను గుంటూరు జైలు నుంచి తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

నిందితుల రిమాండ్ ముగియడంతో తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొనగా, న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించడంతో వారు తిరిగి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున రిమాండ్ పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరినట్లు తెలుస్తోంది.


More Telugu News