రీరిలీజ్‌లోనూ 'బాహుబలి' రికార్డుల మోత.. వసూళ్లు ఎంతంటే?

  • రీరిలీజ్‌లోనూ సత్తా చాటిన 'బాహుబలి'
  • ప్రపంచవ్యాప్తంగా 53 కోట్ల గ్రాస్ వసూళ్లు
  • కొత్త సినిమాలను మించిపోయిన కలెక్షన్లు
  • రీరిలీజ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించిన వైనం
  • తెలుగు రాష్ట్రాల్లోనే 23 కోట్ల వసూళ్లు
ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన అద్భుత దృశ్యకావ్యం 'బాహుబలి' రీరిలీజ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఇటీవల విడుదల చేయగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 53 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. రీరిలీజ్ అయిన సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఒక చారిత్రక విజయంగా ట్రేడ్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు చూస్తే, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ. 23 కోట్లు రాబట్టింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ కలిపి రూ. 9.8 కోట్లు, హిందీలో రూ. 8.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతూ 12 కోట్ల రూపాయల గ్రాస్ వ‌సూలు చేసింది. 

ప్రస్తుతం థియేటర్లలో ఉన్న కొత్త సినిమాలను కూడా వెనక్కి నెట్టి 'బాహుబలి' ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషం. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్ స్టార్‌డమ్‌కు ప్రేక్షకులు మరోసారి బ్రహ్మరథం పట్టారని ఈ వసూళ్లు రుజువు చేస్తున్నాయి. మొత్తం మీద 'బాహుబలి' రీరిలీజ్‌లో అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా నిలిచి, భారతీయ సినిమాలో తన స్థానం ఎప్పటికీ పదిలమని మరోసారి చాటిచెప్పింది.


More Telugu News