ఏపీ లిక్కర్ స్కామ్ కేసు: ధనుంజయరెడ్డి సహా ముగ్గురి డీఫాల్ట్ బెయిల్ రద్దు

  • మద్యం కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు షాక్
  • ఈ నెల 26లోగా లొంగిపోవాలన్న హైకోర్టు 
  • సీఐడీ పిటిషన్‌పై విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించిన న్యాయస్థానం
మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ ప్రత్యేక కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ నెల 26వ తేదీలోగా ఏసీబీ కోర్టు ఎదుట లొంగిపోవాలని వారిని ఆదేశిస్తూ నిన్న కీలక తీర్పు వెలువరించింది.
 
జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ తీర్పును వెలువరించారు. నిందితులు లొంగిపోయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వారికి వెసులుబాటు కల్పించారు. అయితే, వారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై తాజా కేసు మెరిట్స్ ఆధారంగా విచారణ జరపాలని, ఈ తీర్పులోని అభిప్రాయాలతో ప్రభావితం కావొద్దని ఏసీబీ కోర్టుకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తొలుత 24వ తేదీలోగా లొంగిపోవాలని ఆదేశించినా, నిందితుల తరఫు న్యాయవాదుల అభ్యర్థనతో గడువును 26వ తేదీకి పొడిగించారు.
 
సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ అసంపూర్ణంగా ఉందన్న కారణంతో ఈ ఏడాది సెప్టెంబర్ 6న ఏసీబీ కోర్టు ఈ ముగ్గురికీ డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. తమ దర్యాప్తు పూర్తయిందని, చార్జిషీటు దాఖలు చేశాకే నిందితుల రిమాండ్‌ను కోర్టు పలుమార్లు పొడిగించిందని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. చార్జిషీటు తర్వాత రెగ్యులర్ బెయిల్ తిరస్కరించిన కోర్టు, ఆ తర్వాత డీఫాల్ట్ బెయిల్ ఇవ్వడం పరస్పర విరుద్ధమని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఐడీ వాదనలతో ఏకీభవిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారు.


More Telugu News