ఆధార్ దుర్వినియోగానికి చెక్.. రాబోతున్న కొత్త రూల్స్ ఇవే

  • ఆధార్ కార్డుపై ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా మార్పులు
  • వ్యక్తిగత వివరాల దుర్వినియోగాన్ని అరికట్టడమే ప్రధాన లక్ష్యమన్న 'ఉడాయ్' 
  • త్వరలో రానున్న కొత్త యాప్‌తో సులభంగా చిరునామా మార్పులు
ఆధార్ కార్డు స్వరూపం త్వరలో పూర్తిగా మారనుంది. కార్డుపై ఇకపై కేవలం ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే కనిపించనున్నాయి. వ్యక్తిగత సమాచార దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భారత విశిష్ఠ‌ గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) సీఈఓ భువనేశ్ కుమార్ వెల్లడించారు. బ్యాంకులు, హోటళ్లు, ఫిన్‌టెక్ సంస్థల ప్రతినిధులతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు.

"ఆధార్ కార్డుపై అనవసరమైన వివరాలు ఎందుకుండాలి? అనే ఆలోచనతోనే ఈ మార్పులు చేస్తున్నాం. డిసెంబరులోగా కొత్త నిబంధనలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం" అని భువనేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం అనేక సంస్థలు ఆఫ్‌లైన్‌ ధ్రువీకరణ పేరుతో ఆధార్ కార్డు ఫొటో కాపీలను తీసుకుని భద్రపరుస్తున్నాయని, ఇది ఆధార్ చట్టానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి ఇలాంటి ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ పద్ధతులను చెక్ పెట్టేందుకు ఉడాయ్ చర్యలు తీసుకోనుంది. ఆధార్‌ను ఒక డాక్యుమెంటులా కాకుండా, క్యూఆర్ కోడ్ లేదా నంబరు ద్వారా ధ్రువీకరించాలని ఆయన సూచించారు.

ఈ మార్పులతో పాటు సరికొత్త యాప్‌ను కూడా ఉడాయ్ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతమున్న ఎం-ఆధార్ యాప్ స్థానంలో రానున్న ఈ కొత్త యాప్‌లో 'ఫేస్ అథెంటికేషన్' ఫీచర్ ఉంటుంది. దీని సాయంతో వినియోగదారులే స్వయంగా తమ చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను సులభంగా మార్చుకోవచ్చు. మరో 18 నెలల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్న వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ చట్టానికి అనుగుణంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ఆయన వివరించారు.


More Telugu News