టీ20 ప్రపంచకప్‌పైనే ఫోకస్.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు పాండ్యా, బుమ్రా దూరం!

  • దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరంగా హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా
  • వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం
  • గాయం నుంచి కోలుకుంటున్న పాండ్యాకు మరికొంత విశ్రాంతి
  • బుమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద రెస్ట్ ఇవ్వనున్న సెలక్టర్లు
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ నెల‌ 30 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరికీ విశ్రాంతినిచ్చి, పొట్టి ఫార్మాట్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

క్వాడ్రిసెప్స్ గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిటర్న్ టు ప్లే (RTP) శిక్షణ పొందుతున్నాడు. "గాయం నుంచి కోలుకున్న వెంటనే 50 ఓవర్ల ఫార్మాట్ ఆడించడం రిస్క్‌తో కూడుకుంది. అతని వర్క్‌లోడ్‌ను క్రమంగా పెంచాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్ వరకు హార్దిక్ టీ20లకే ప్రాధాన్యత ఇస్తాడు" అని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు హార్దిక్ ముందుగా దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున ఆడనున్నాడు.

మరోవైపు కీలక పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు పనిభారం తగ్గించే ఉద్దేశంతో ఈ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ సన్నాహకాలకు ఈ వన్డే సిరీస్ అంత ముఖ్యం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఐపీఎల్ తర్వాతే 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా సీనియర్ ఆటగాళ్ల దృష్టి మళ్లే అవకాశం ఉంది.


More Telugu News