సినీ దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు

  • రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానరసేన సంస్థ
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ‘రాష్ట్రీయ వానరసేన’ అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదును అందజేసింది. 'వారణాసి' సినిమా టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆ సంస్థ ఆరోపించింది.

ఫిర్యాదులో వానరసేన సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు. "ఇటీవల సినిమాల్లో హిందూ దేవతలను కించపరిచే ధోరణి పెరిగింది. మత విశ్వాసాలను దెబ్బతీయడం చట్టవిరుద్ధం. రాజమౌళిపై కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ జరపాలి" అని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సినీ పరిశ్రమలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వానరసేన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. కొందరు రాజమౌళి వ్యాఖ్యలను తప్పుబడుతుంటే, మరికొందరు ఆయన మాటలను అపార్థం చేసుకున్నారని సమర్థిస్తున్నారు. 

ఇక ‘వారణాసి’ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


More Telugu News