ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో మళ్లీ అదే సీన్.. మైదానంలో హై టెన్షన్

  • భారత్-పాక్ మ్యాచ్‌లో హై టెన్షన్
  • భారత్ బ్యాటర్ నమన్ ధీర్‌పై పాక్ స్పిన్నర్ దూకుడు
  • ఫోర్ కొట్టిన మరుసటి బంతికే ఔట్ చేసిన బౌలర్
  • పెవిలియన్‌కు వెళ్లమంటూ దూకుడుగా సైగలు
  • మౌనంగా మైదానం వీడిన భారత ఆటగాడు
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా భారత్-ఏ, పాకిస్థాన్-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత బ్యాటర్ నమన్ ధీర్‌ను ఔట్ చేసిన పాక్ స్పిన్నర్ సాద్ మసూద్, దూకుడుగా ప్రవర్తిస్తూ మైదానం వీడమంటూ సైగలు చేశాడు. ఈ ఘటన క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఖతార్‌లోని దోహా వేదికగా నిన్న‌ జరిగిన ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఆ ఓవర్‌లోని ఒక బంతికి ధీర్ బౌండరీ బాదాడు. అయితే, ఆ తర్వాతి బంతికే పాక్ కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వికెట్ తీసిన ఆనందంలో సాద్ మసూద్ ఆవేశాన్ని ప్రదర్శించాడు. పెవిలియన్ వైపు వేలు చూపిస్తూ, వెళ్ళిపోమంటూ ధీర్‌కు సైగ చేశాడు. అయితే, ధీర్ ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వకుండా మౌనంగా మైదానం వీడాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్-ఏ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు తమ తొలి మ్యాచ్‌లలో యూఏఈ, ఒమన్‌లపై విజయం సాధించాయి.

యూఏఈతో జరిగిన గత మ్యాచ్‌లో భారత యువ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీలలో రెండో స్థానంలో నిలిచాడు. ఆ మ్యాచ్‌లో అతను 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్లతో 144 పరుగులు చేశాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్-ఏ జట్టు 4 వికెట్లకు 297 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.


More Telugu News