అంధుల మహిళల టీ20 వరల్డ్ కప్... సెమీస్ లోకి దూసుకెళ్లిన భారత్

  • అంధుల మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్స్‌కు చేరిన భారత్
  • అమెరికాపై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం
  • 61 పరుగుల లక్ష్యాన్ని 3.3 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా
  • 12 బంతుల్లో 31 పరుగులు చేసిన సిమ్రన్‌జీత్ కౌర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
  • టోర్నీలో భారత జట్టుకు ఇది వరుసగా నాలుగో విజయం
  • ఆదివారం కొలంబోలో పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్
ఐసీసీ అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌ 2025లో భారత జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగిస్తోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. టోర్నమెంట్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో గెలుపు కావడం విశేషం.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న అమెరికా జట్టు, భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు నిలవలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. అమెరికా తరఫున తాన్యానా (17), కరోలిన్ (12) కాసేపు పోరాడినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో సిమ్రన్‌జీత్ కౌర్, సునీత, సిము దాస్, గంగా కదమ్ తలో వికెట్ పడగొట్టారు. పటిష్టమైన ఫీల్డింగ్‌తో పలు రనౌట్లు కూడా చేశారు.

కేవలం 61 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించింది. కేవలం 3.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించి, అద్భుత విజయాన్ని అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సిమ్రన్‌జీత్ కౌర్ 12 బంతుల్లోనే అజేయంగా 31 పరుగులు చేయగా, మరో ఓపెనర్ కావ్య 12 బంతుల్లో 21 పరుగులతో రాణించింది.

ఈ టోర్నమెంట్‌లో అరంగేట్రం చేసిన అమెరికా జట్టు, భారత సంస్థల సహకారంతో ఏడాది క్రితమే ఏర్పడింది. అనుభవంలో తేడా స్పష్టంగా కనిపించినా, వారి పోరాట స్ఫూర్తి ఆకట్టుకుంది. ఈ విజయంతో సెమీస్‌కు చేరిన భారత్, ఆదివారం కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

తొలిసారిగా అంధులకు నిర్వహిస్తున్న ఈ టీ20 వరల్డ్ కప్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్నాయి.


More Telugu News