: టీటీడీ మాజీ అధికారి సతీష్ మృతి కేసులో కీలక మలుపు.. హత్యగా నిర్ధారణ!

  • సీఐడీ విచారణకు వెళ్తుండగా రైలులో ఘటన
  • తాడిపత్రి సమీపంలో రైలు పట్టాలపై మృతదేహం లభ్యం
  • గుత్తి జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు
  • పరకామణి చోరీ కేసులో సతీష్ ప్రధాన ఫిర్యాదుదారు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ సహాయ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి (ఏవీఎస్‌వో) వై. సతీష్ కుమార్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా కాకుండా హత్యగా నిర్ధరించిన రైల్వే పోలీసులు, కేసు నమోదు చేశారు. తిరుమల పరకామణిలో డాలర్ల చోరీ కేసులోని నిందితులే ఈ హత్యకు పాల్పడినట్లు మృతుని బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుత్తి జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
 
ప్రస్తుతం గుంతకల్లు రైల్వే సీఐగా పనిచేస్తున్న సతీష్ కుమార్, గతంలో టీటీడీ ఏవీఎస్‌వోగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో పరకామణిలో జరిగిన డాలర్ల చోరీ కేసులో ఈయనే ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి ఆయన గుంతకల్లు నుంచి రైలులో బయలుదేరారు.
 
అయితే, శుక్రవారం ఉదయం తాడిపత్రి మండలం కోమలి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాల పక్కన ఆయన విగతజీవిగా కనిపించారు. ఇదే కేసులో ఇప్పటికే ఈ నెల 6న ఒకసారి సీఐడీ విచారణకు హాజరైన ఆయన, రెండోసారి విచారణకు వెళ్తుండగా ఈ దారుణం చోటుచేసుకోవడం పలు అనుమానాలకు దారి తీసింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News