పెళ్లి సంబంధాలు కుదరట్లేదని మనస్తాపం.. యువకుడి బలవన్మరణం

  • హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన నరేశ్  
  • హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ వద్ద రైలు కిందపడి బలవన్మరణం
  • బట్టల షాపులో పనిచేస్తుండటంతో సంబంధాలు కుదరలేదని ఆవేదన
  • నాలుగేళ్లుగా పెళ్లి ప్రయత్నాలు విఫలం కావడంతో తీవ్ర నిర్ణయం
హైదరాబాద్‌లో ఓ యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. మూడు పదుల వయసు దాటినా పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన బూర సురేందర్, రమ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన నరేశ్ (32) హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమార్తెకు వివాహం కాగా, నరేశ్‌కు గత నాలుగేళ్లుగా కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

అయితే, నరేశ్ ఓ బట్టల షాపులో పనిచేస్తున్నాడనే కారణంతో పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో నరేశ్ తీవ్ర మస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన నరేశ్, మంగళవారం మధ్యాహ్నం ఘట్‌కేసర్‌లోని మాధవరెడ్డి ఫ్లై ఓవర్ సమీపంలో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. 


More Telugu News