పార్టనర్‌షిప్ సమ్మిట్ కు ముందే విశాఖలో ఐటీ కంపెనీల జాతర!

  • రేపు 4 ఐటీ సంస్థలు, 2 భారీ ప్రాజెక్టులకు మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శ్రీకారం
  • రహేజా ఐటీ స్పేస్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
  • విశాఖ ఐటీ హిల్స్‌లో కొలువుదీరనున్న సెయిల్స్, ఐ స్పేస్, టెక్ తమ్మిన, ఫినోమ్
  • వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాల కల్పన
  • టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ బాటలో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు ముందే విశాఖపట్నంలో ఐటీ కంపెనీల సందడి మొదలైంది. సదస్సుకు ఒకరోజు ముందు, అంటే రేపు (నవంబర్ 13న), రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఏకంగా నాలుగు ఐటీ కంపెనీలతో పాటు రెండు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగనుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్, రహేజా ఐటీ స్పేస్ వంటి కీలక ప్రాజెక్టులు ఇందులో ఉండటంతో విశాఖ రూపురేఖలు మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సు జరగనుండగా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి ఊతమిచ్చేలా, సదస్సు ప్రారంభానికి ముందే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు రావడం శుభపరిణామం. 

ఇప్పటికే టీసీఎస్ (12,000 ఉద్యోగాలు), కాగ్నిజెంట్ (8,000 ఉద్యోగాలు) వంటి దిగ్గజ సంస్థలు తమ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. దీనికి తోడు, మంత్రి లోకేశ్ కృషితో గూగుల్ సంస్థ అమెరికా వెలుపల తన అతిపెద్ద ఏఐ హబ్‌ను రూ.1.35 లక్షల కోట్లతో ఇక్కడ నెలకొల్పేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో మరిన్ని సంస్థలు విశాఖ వైపు చూస్తున్నాయి.

రేపు ప్రారంభం కానున్న సంస్థలు, ప్రాజెక్టుల వివరాలు

1. సెయిల్స్ సాఫ్ట్‌వేర్: ఐటీ హిల్ నెం.3లో ఏర్పాటు చేయనున్న ఈ అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్, ఏఐ ఎక్సలెన్స్ సెంటర్‌కు మంత్రి లోకేశ్ భూమిపూజ చేస్తారు. దీని ద్వారా 300 మందికి పైగా ఐటీ నిపుణులకు ఉపాధి లభించనుంది.

2. ఐ స్పేస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్: ఐటీ హిల్ నెం.2లో ఈ సంస్థ తన యూనిట్‌ను ప్రారంభించనుంది. హెల్త్‌కేర్ ఐటీ సేవలు, ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌పై దృష్టి సారించనున్న ఈ సంస్థ, విశాఖలో ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది.

3. టెక్ తమ్మిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్: ఐటీ హిల్ నెం.2లో కార్యకలాపాలు ప్రారంభించనున్న ఈ సంస్థ, లో-కోడ్, ఏఐ టెక్నాలజీలపై దృష్టి సారిస్తుంది. రాబోయే ఐదేళ్లలో 2,000 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

4. ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్: ఐటీ హిల్ నెం.2లో ఏర్పాటు చేయనున్న ఈ గ్లోబల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేస్తారు. రెండు దశల్లో మొత్తం రూ.205 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.

5. రహేజా ఐటీ స్పేస్ & రెసిడెన్షియల్ ప్రాజెక్టు: విశాఖకు తరలివస్తున్న ఐటీ కంపెనీలు, ఉద్యోగుల అవసరాలను తీర్చేందుకు మధురవాడ ఐటీ హిల్ నెం.3లో రహేజా కార్ప్ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. తొలి దశలో రూ.2,172 కోట్ల పెట్టుబడితో 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

6. వరల్డ్ ట్రేడ్ సెంటర్ (WTC): యండాడలో కపిల్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేస్తారు. 7.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ కేంద్రం, వ్యాపార నెట్‌వర్కింగ్, పెట్టుబడుల ఆకర్షణ, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా నిలవనుంది.

ఈ వరుస శంకుస్థాపనలు విశాఖను గ్లోబల్ ఐటీ, వాణిజ్య హబ్‌గా నిలబెట్టే ప్రభుత్వ ప్రయత్నాలకు నిదర్శనమని, పార్టనర్‌షిప్ సమ్మిట్ ద్వారా మరిన్ని పెట్టుబడులు ఖాయమనే సంకేతాలను పంపుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.


More Telugu News