ఢిల్లీ పేలుడు కేసు: ఉమర్ నబీ పేరు మీద మరో కారు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

  • ఎర్రకోట సమీపంలో పేలిపోయిన ఐ20 కారు
  • నిందితుడి పేరుపై మరో కారు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
  • ఫరీదాబాద్ జిల్లాలో ఖాండవాలీ గ్రామంలో ఎరుపు రంగు కారు స్వాధీనం 
ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట సమీపంలో పేలిపోయిన ఐ20 కారును నడిపిన నిందితుడి పేరు మీద మరో కారు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అది ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు అని గుర్తించారు. ఈ కారు కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి, హర్యానా రాష్ట్రంలోని ఒక గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు.

ఐ20 కారును నిందితుడు ఉమర్ నబీ నడిపినట్లు గుర్తించారు. అతని పేరు మీదే ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కూడా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు నిర్ధారించి, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లు, చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని సూచనలు జారీ చేశారు.

ఉమర్ నబీ పేరు మీద ఉన్న ఈ కారును గుర్తించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కారు గురించిన సమాచారం ఎక్కడైనా తెలిస్తే వెంటనే తెలియజేయాలని కారు నెంబర్, ఇతర వివరాలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. చివరకి ఫరీదాబాద్ జిల్లాలోని ఖాండవాలీ గ్రామంలో ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Umar Nabi
Delhi car blast
Red Fort
I20 car
Ford EcoSport
Haryana Police

More Telugu News