Shashi Tharoor: మళ్లీ సొంత పార్టీని ఇరుకునపెట్టిన థరూర్.. అద్వానీపై పొగడ్తలతో దుమారం.. కాంగ్రెస్ స్పంద‌న ఇదే!

Shashi Tharoor Praises LK Advani Congress Party Responds
  • బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీపై శశిథరూర్ ప్రశంసలు
  • థరూర్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్న కాంగ్రెస్
  • ఒక సంఘటనతో అద్వానీని అంచనా వేయడం సరికాదన్న థరూర్
  • థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో చెలరేగిన అంతర్గత దుమారం
  • గతంలోనూ మోదీ, వారసత్వ రాజకీయాలపై వ్యాఖ్యలతో వివాదాలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ మరోసారి తన వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇరకాటంలో పడేశారు. బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీని ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు పూర్తిగా శశిథరూర్ వ్యక్తిగతమని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదివారం స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల 98వ పుట్టినరోజు జరుపుకున్న ఎల్‌కే అద్వానీకి శశిథరూర్ ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. "గౌరవనీయులైన ఎల్‌కే అద్వానీకి 98వ జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో ఆయన నిబద్ధత, నిరాడంబరత, ఆధునిక భారత గతిని మార్చడంలో ఆయన పాత్ర చెరగనివి" అని థరూర్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రామ్ జన్మభూమి ఉద్యమంలో అద్వానీ పాత్రను గుర్తుచేస్తూ ప్రముఖ న్యాయవాది సంజయ్ హెగ్డే వంటి వారు థరూర్‌ను తప్పుబట్టారు.

ఈ విమర్శలపై థరూర్ స్పందిస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఒకే ఒక్క సంఘటన ఆధారంగా అద్వానీ సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అంచనా వేయడం అన్యాయమని అన్నారు. "జవహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితాన్ని చైనాతో ఎదురైన ఓటమి ఆధారంగా, ఇందిరాగాంధీని ఎమర్జెన్సీతో ముడిపెట్టి పూర్తిగా అంచనా వేయలేం. అద్వానీజీకి కూడా అదే గౌరవాన్ని ఇవ్వాలని నేను నమ్ముతున్నాను" అని బదులిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ స్పందన‌
ఈ వివాదం ముదరడంతో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించింది. పార్టీ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా ‘ఎక్స్‌’లో స్పందిస్తూ, "ఎప్పటిలాగే, డాక్టర్ శశిథరూర్ తన వ్యక్తిగత అభిప్రాయాలనే వెల్లడించారు. ఆయన తాజా వ్యాఖ్యలతో భారత జాతీయ కాంగ్రెస్ పూర్తిగా విభేదిస్తోంది" అని స్పష్టం చేశారు. అయినప్పటికీ, థరూర్ కాంగ్రెస్ ఎంపీగా, సీడబ్ల్యూసీ సభ్యుడిగా కొనసాగడం పార్టీలోని ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

శశిథరూర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడం ఇది మొదటిసారి కాదు. ఇటీవలే ఆయన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు రాసిన వ్యాసంలో "భారత్‌లో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికి, ప్రతిభకు పట్టం కట్టాల్సిన సమయం ఆసన్నమైంది" అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకున్న బీజేపీ, రాహుల్ గాంధీపై అసంతృప్తితోనే థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శించింది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా అభివర్ణించడం కూడా కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. 
Shashi Tharoor
LK Advani
Congress Party
Pawan Khera
Indian National Congress
Ram Janmabhoomi
Dynastic Politics
Political Controversy
India Politics
BJP

More Telugu News