Ambati Rambabu: తిరుమల అన్నప్రసాదంపై అంబటి రాంబాబు ప్రశంసలు... వీడియో ఇదిగో!

Ambati Rambabu Praises Tirumala Anna Prasadam Program
  • కుటుంబంతో తిరుమల వెళ్లిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు
  • శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించి ఎంతో తృప్తి చెందానని వెల్లడి
  • భోజనం రుచికరంగా, పరిశుభ్రంగా ఉందని ప్రశంసలు
  • రోజుకు 90 వేల మందికి అన్నదానం చేయడంపై ఆశ్చర్యం
  • రూ. 2,700 కోట్ల విరాళాల వడ్డీతో కార్యక్రమ నిర్వహణ అని వెల్లడి
  • భక్తులందరూ తప్పకుండా ప్రసాదం స్వీకరించాలని విజ్ఞప్తి
తిరుమల పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న అన్నప్రసాద కార్యక్రమం అద్భుతంగా ఉందని, అక్కడ భోజనం చేయడం తనకు వర్ణించలేని తృప్తినిచ్చిందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నానని వెల్లడించారు. ఆ పర్యటనలో అన్నప్రసాదం స్వీకరించిన అనుభవాన్ని ఆయన ఓ వీడియో రూపంలో పంచుకున్నారు. ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందో అర్థంకాలేదని అన్నారు.

శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అందరితో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి వెళ్లినట్లు అంబటి రాంబాబు తెలిపారు. అక్కడి భోజనాన్ని కేవలం భోజనంగా చూడలేమని, అది సాక్షాత్తూ భగవంతుడు అందించిన ప్రసాదమని ఆయన అభివర్ణించారు. ఆ ప్రసాదం చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, భవనాన్ని అత్యంత పరిశుభ్రంగా (హైజినిక్‌గా) నిర్వహిస్తున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని కొనియాడారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని, ప్రసాదం స్వీకరించడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.

నిర్వహణ తీరుపై అంబటి ఆశ్చర్యం

అన్నదాన కార్యక్రమం నిర్వహణ వెనుక ఉన్న వాస్తవాలు తెలుసుకుని తాను ఆశ్చర్యపోయానని అంబటి రాంబాబు పేర్కొన్నారు. సాధారణ రోజుల్లోనే ప్రతిరోజూ సుమారు 90,000 మంది భక్తులకు అక్కడ భోజన సదుపాయం కల్పిస్తున్నారని, ఇక బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక పర్వదినాల్లో ఈ సంఖ్య లక్షా 30 వేల నుంచి లక్షా 40 వేల వరకు చేరుకుంటుందని తెలుసుకుని అబ్బురపడ్డానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు సమర్పించిన విరాళాలతో ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగుతోందని ఆయన వివరించారు.

ఈ అన్నదాన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రస్టుకు భక్తుల నుంచి సుమారు రూ. 2,700 కోట్ల రూపాయల విరాళాలు అందాయని, ఆ భారీ మొత్తంపై వచ్చే వడ్డీతోనే ఈ అన్నదాన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారనే విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అంబటి అన్నారు. 1985లో ప్రారంభమైన ఈ సేవ, ఇన్ని దశాబ్దాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగడం వెనుక ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం, ఆయన ఆశీస్సులే కారణమని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తిరుమలకు వచ్చే భక్తులు ఎవరైనా, అవకాశం ఉంటే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి భోజనం ఏదో ఒక సమయంలో తప్పకుండా శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి, భగవంతుని ఆశీస్సులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Ambati Rambabu
Tirumala
TTD
Anna Prasadam
Sri Venkateswara Swamy
Tirupati
Andhra Pradesh
Hindu Temple
Free Food
Donations

More Telugu News