ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా ఉద్యమం: అంబటి రాంబాబు

  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైసీపీ
  • ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలకు నిర్ణయం
  • కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపు
  • నిరసన ర్యాలీల పోస్టర్‌ను విడుదల చేసిన నేతలు
  • జగన్ తెచ్చిన కాలేజీలపై కక్ష సాధింపు తగదన్న అంబటి
రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 'కోటి సంతకాల' సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టి, ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిరసన ర్యాలీలకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నేతలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, టీజేఆర్ సుధాకర్ బాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, మనోహర్ రెడ్డి, వంగవీటి నరేంద్ర, చంద్రశేఖర్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. "మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయం చాలా దురదృష్టకరం. మాజీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష కట్టడం సరికాదు" అని అన్నారు.

ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థులకు వ్యతిరేకంగా ఉందని ఆయన ఆరోపించారు. "ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ చేపడుతున్నాం. ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తాం" అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 


More Telugu News