వాటికన్ లో పోప్ ఎదుట సల్మాన్ ఖాన్ పాట పాడిన ఇలియా వాంచూర్

  • సల్మాన్ ఖాన్ సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన ఇలియా వాంచూర్
  • వాటికన్‌లో తొలిసారిగా మోగిన బాలీవుడ్ పాట
  • సల్మాన్ ఖాన్ ‘బాడీగార్డ్’ చిత్రంలోని గీతాన్ని ఆలపించిన ఇలియా
  • పోప్ లియో XIV సమక్షంలో జరిగిన ప్రదర్శన
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన రొమేనియన్ నటి, గాయని ఇలియా వాంచూర్ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. వాటికన్‌లో, పోప్ సమక్షంలో ఒక బాలీవుడ్ పాట పాడి చరిత్ర సృష్టించారు. సల్మాన్ ఖాన్ నటించిన ‘బాడీగార్డ్’ చిత్రంలోని సూపర్ హిట్ గీతం ‘తేరీ మేరీ ప్రేమ్ కహానీ’ని ఆమె ఆలపించారు. వాటికన్‌లో ఒక భారతీయ సినిమా పాటను ప్రదర్శించడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం.

ప్రపంచంలోని వివిధ మతాల మధ్య సంభాషణ, అవగాహన, ఐక్యతను ప్రోత్సహించే ‘నోస్ట్రా ఏటేట్’ చారిత్రక ప్రకటన 60వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేదికపై ఇలియా తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పోప్ లియో XIVను కలుసుకునే అవకాశం కూడా పొందారు.

పోప్‌తో భేటీ అనంతరం ఇలియా తన అనుభవాన్ని పంచుకున్నారు. "పోప్‌ను కలవడం మాటల్లో చెప్పలేని అనుభూతి. ఆయన సాన్నిధ్యం ఎంతో ఆత్మీయతను, దయను పంచుతుంది. నాలో కృతజ్ఞతా భావాన్ని, ప్రశాంతతను నింపింది. కరుణ, వినయం, మానవ సంబంధాలే నిజమైన విశ్వాసానికి పునాది అని ఈ భేటీ గుర్తు చేసింది" అని ఆమె తెలిపారు. 

వాటికన్‌లో పాడటంపై స్పందిస్తూ, "ఇది కేవలం ఒక ప్రదర్శన కాదు, సంగీతం ద్వారా చేసిన ప్రార్థన. ఇంతటి ఆధ్యాత్మిక ప్రదేశంలో భారతీయ గీతాన్ని వినిపించడం అద్భుతంగా అనిపించింది. సంగీతానికి సరిహద్దులు, మతాలు లేవని, ప్రేమ అనే భాష మాత్రమే దానికి తెలుసని ఇది నిరూపించింది" అని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఇలియా మరో ఘనతను కూడా సాధించారు. ‘డెస్పాసిటో’, జస్టిన్ బీబర్, మరియా క్యారీ వంటి వారికి చార్ట్‌బస్టర్ హిట్స్ అందించిన గ్రామీ అవార్డు గ్రహీత, అమెరికన్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ జాసన్ 'పూ బేర్' బాయ్డ్‌తో కలిసి ఒక పాటను రికార్డ్ చేశారు. అంతర్జాతీయ సంగీతకారులైన స్టీఫెన్ దేవస్సీ, విజయ్ ఏసుదాస్ వంటి వారితో కలిసి 'వి ఆర్ ది న్యూ వరల్డ్' అనే గీతాన్ని కూడా ఆలపించారు.

ఇక ఇలియా వంతూర్ కెరీర్ విషయానికొస్తే, ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ఎకోస్ ఆఫ్ అజ్’ అనే చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బెంగళూరు షార్ట్స్ ఫిల్మ్ ఫెస్టివల్, గ్లోబల్ ఇండి ఫిల్మ్ మేకర్ అవార్డ్స్ వంటి పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. ప్రముఖ నటి పూజా బాత్రా నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు దీపక్ తిజోరి కూడా నటించారు.


More Telugu News