చెప్పుతో కొట్టుకోవాలనిపించేంతగా బాధపడ్డా: 'బిగ్‌బాస్‌'పై విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు

  • డబ్బుల కోసం, కొత్త ఇల్లు కట్టుకోవాలనే షోకు వెళ్లానని వెల్లడి
  • ఆ కోరిక నెరవేరలేదని, ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉన్నానని ఆవేదన
  • బిగ్‌బాస్‌కు వెళ్లడం తన జీవితంలో తీసుకున్న పెద్ద తప్పు అని వ్యాఖ్య
తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. ప్రస్తుతం తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షోపై మాజీ కంటెస్టెంట్, ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లడం తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయమని ఆమె చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

‘పోవే పోరా’ వంటి టీవీ షోలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న విష్ణుప్రియ, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. గతంలో ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని, తోటి కంటెస్టెంట్ పృథ్వీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వార్తల్లో నిలిచారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన బిగ్‌బాస్ అనుభవంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా విష్ణుప్రియ మాట్లాడుతూ, “నేను బిగ్‌బాస్ షోకు కేవలం డబ్బుల కోసమే వెళ్లాను. ఆ డబ్బుతో కొత్త ఇల్లు కట్టుకోవచ్చని ఆశపడ్డాను. కానీ నా ఆశ నెరవేరలేదు. ఇప్పటికీ నేను పాత ఇంట్లోనే ఉంటున్నాను. నిజం చెప్పాలంటే, బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లడం నా జీవితంలో నేను తీసుకున్న ఓ చెత్త నిర్ణయం. ఆ షో నుంచి నేనేమీ నేర్చుకోలేదు. నన్ను నేనే తిట్టుకున్నాను. ఎందుకు వెళ్లానురా బాబూ అనిపించింది. నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి అనిపించేంతగా బాధపడ్డాను. మళ్లీ వాళ్లు పిలిచినా వెళ్లను” అని తన ఆవేదనను వెళ్లగక్కారు.

ప్రస్తుతం బిగ్‌బాస్ కొత్త సీజన్ విజయవంతంగా నడుస్తున్న తరుణంలో విష్ణుప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొందరు ఆమె నిజాయతీని మెచ్చుకుంటుండగా, మరికొందరు "షో ద్వారా వచ్చిన పాప్యులారిటీని ఆస్వాదించి ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదు" అంటూ విమర్శిస్తున్నారు. ఏదేమైనా, విష్ణుప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


More Telugu News