జగన్ పర్యటనలో పోలీసులతో వాగ్వాదం... వైసీపీ నేతలపై కేసు నమోదు

  • పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై కేసు నమోదు
  • జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ
  • హైవేపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పోలీసులతో వాగ్వాదం
పామర్రు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కైలే అనిల్ కుమార్‌తో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

కేసు వివరాల్లోకి వెళితే, నిన్న జగన్ పర్యటనలో భాగంగా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని సీఐ చిట్టిబాబు వైకాపా నేతలను కోరారు. అయితే, ఆ సమయంలో కైలే అనిల్ కుమార్, ఇతర నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ ఇష్టప్రకారం చేస్తామంటూ పోలీసుల సూచనలను తోసిపుచ్చినట్టు ఆరోపణ.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన డ్రోన్ విజువల్స్‌ను పరిశీలిస్తున్నామని, వాటి ఆధారంగా వాగ్వాదానికి దిగిన మిగతా వారిని కూడా గుర్తించి కేసులు నమోదు చేస్తామని సీఐ చిట్టిబాబు స్పష్టం చేశారు.

Kaile Anil Kumar
Jagan Mohan Reddy
YSRCP
Pamidi Mukkala
Krishna District
Andhra Pradesh Politics
Police Complaint
Traffic Disruption
Gopuvanipalem
Chitti Babu CI

More Telugu News