Chhattisgarh Train Accident: ఛత్తీస్‌గఢ్‌లో గూడ్స్, ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లో నిన్న మధ్యాహ్నం జరిగిన రైలు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. బిలాస్‌పూర్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలును వేగంగా వచ్చిన లోకల్ ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. లోకల్ ట్రైన్ సిగ్నల్‌ను దాటి ముందుకు వెళ్లడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

బిలాస్‌పూర్-కట్నీ సెక్షన్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఢీకొన్న తీవ్రతకు లోకల్ ట్రైన్ బోగీలు చెల్లాచెదురై పట్టాలు తప్పాయి. విద్యుత్ తీగలు, సిగ్నలింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే రైల్వే సహాయక బృందాలు, ఆర్‌పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.

 రూ.10 లక్షల పరిహారం ప్రకటన
ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని పేర్కొన్నారు. బిలాస్‌పూర్ కలెక్టర్‌తో మాట్లాడి తక్షణ సహాయక చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు, రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరిపి, ప్రమాదానికి కచ్చితమైన కారణాలను తేల్చనున్నారు.

ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎల్‌టీటీ-షాలిమార్ ఎక్స్‌ప్రెస్, ముంబై-హౌరా మెయిల్, గోండియా-రాయ్‌గఢ్ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాక్‌ను క్లియర్ చేసి, రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Chhattisgarh Train Accident
Bilaspur train collision
Indian Railways accident
Vishnu Deo Sai
Train accident India
Bilaspur-Katni section
Railway compensation
Goods train collision
Passenger train accident
Train derailment

More Telugu News