బీజేపీ అధ్యక్షుడిని కలిసిన జనసేన నాయకులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు!

  • బీజేపీ తరఫున పోటీ చేస్తున్న లంకల దీపక్ రెడ్డి
  • రామచందర్ రావు, కిషన్ రెడ్డిలను కలిసిన తెలంగాణ జనసేన ఇన్‌ఛార్జ్
  • బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయనున్న జనసేన నాయకులు
తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులు ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డిలను జనసేన తెలంగాణ ఇన్‌ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పలువురు నాయకులు కలసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు పరస్పరం కండువాలు మార్చుకున్నారు.

మాగంటి గోపీనాథ్ అకాల మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ జనసేన పార్టీ బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ఎన్నికల ప్రచారానికి మరో నాలుగైదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో జనసేన నాయకులు దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.

Lankala Deepak Reddy
Jubilee Hills by election
Telangana BJP
Janasena support
Ramachander Rao

More Telugu News