హర్యానాలో దారుణం... నడిరోడ్డు మీద బాలికపై కాల్పులు జరిపిన దుండగుడు

  • ఫరీదాబాద్ నగరంలోని ప్రైవేటు లైబ్రరీ బయట కాల్పులు
  • బాలికను కొన్ని రోజులుగా అనుసరిస్తున్న నిందితుడు
  • గాయపడిన బాలికకు ఆసుపత్రిలో చికిత్స
హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై కాల్పులు జరిపాడు. కాల్పులకు తెగబడిన యువకుడు గత కొన్ని రోజులుగా ఆమెను వెంబడిస్తున్నాడు. ఈ ఘటన నగరంలోని ఒక ప్రైవేటు లైబ్రరీ వెలుపల చోటు చేసుకుంది. వీరిద్దరు నిత్యం ఆ లైబ్రరీకి వస్తున్నట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.

కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఆ బాలిక దినచర్యను తెలుసుకుని నిత్యం ఆమె రాక కోసం వేచి చూస్తున్నాడని విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. బాలిక సంఘటన స్థలానికి రావడానికి కొద్దిసేపటి ముందు నిందితుడు ఆ ప్రాంతానికి వచ్చి వేచి చూస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. ఆమె లైబ్రరీకి వచ్చే విషయం తెలుసుకుని అతను నిత్యం ఆమెను అనుసరిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

ఈ కాల్పుల్లో బాలికకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తి తనకు తెలుసని, ఎన్నో రోజుల నుంచి తనను అనుసరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని బాలిక తెలిపింది. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఆయుధాన్ని సంఘటన స్థలంలోనే పారవేశాడని పోలీసులు తెలిపారు. పోలీసులు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


More Telugu News

Faridabad Girl Shooting Haryana crime Faridabad crime Girl shot in Faridabad stalking case crime news