ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. నిందితుల ఆస్తుల స్వాధీనానికి కోర్టు సమ్మతి

  • మద్యం ముడుపుల కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కోర్టు అనుమతి
  • ప్రభుత్వ జీవోల ఆధారంగా సిట్ అధికారులు పిటిషన్ దాఖలు
  • ఏ1 నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఆస్తుల జప్తునకు మార్గం సుగమం
  • కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోనున్న అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం ముడుపుల (ఏపీ లిక్కర్ స్కామ్) కేసులో దర్యాప్తు సంస్థలకు కీలక ముందడుగు లభించింది. ఈ కేసులో నిందితులు అక్రమంగా సంపాదించిన ఆస్తులను అటాచ్‌ చేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతులు జారీ చేసింది.

గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 111, 126ల ప్రకారం ఆస్తుల జప్తునకు అనుమతించాలని కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు అనుమతితో కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ముడుపులతో ప్రధాన నిందితుడు (ఏ1) రాజ్ కెసిరెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. తన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట పలుచోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు పక్కా ఆధారాలను అధికారులు సేకరించారు. ఈ అక్రమ సంపాదనతో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామెరపల్లె, మాచన్‌పల్లి గ్రామాల పరిధిలో రాజ్ కెసిరెడ్డి తన పేరు మీద 27.06 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్ల ద్వారా గుర్తించారు.

అదే ప్రాంతంలో తన తల్లి కెసిరెడ్డి సుభాషిణి పేరు మీద మరో 3.14 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నట్లు తేలింది. ఈ మొత్తం 30.20 ఎకరాల భూమిని జప్తు చేసేందుకు ప్రభుత్వం గతంలోనే సీఐడీకి అధికారం ఇచ్చింది. వీటితో పాటు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని గచ్చిబౌలిలో రూ.1.46 కోట్ల విలువైన 326 గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు సీఐడీ నిర్ధారించింది. మాచన్‌పల్లి గ్రామంలో తన కంపెనీతో పాటు తల్లి పేరు మీద మరో 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. తాజా కోర్టు ఉత్తర్వులతో ఈ ఆస్తులన్నింటినీ జప్తు చేసే ప్రక్రియను సిట్ అధికారులు ప్రారంభించనున్నారు. 


More Telugu News