: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు.. ఐదుగురికి ఉరిశిక్ష

  • పదేళ్ల క్రితం మేయర్ దంపతుల దారుణ హత్య
  • 23 మంది నిందితులలో ఐదుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం
  • ఉరిశిక్ష పడిన దోషులలో మేయర్ భర్త మేనల్లుడు చింటూ 
చిత్తూరులో పదేళ్ల క్రితం సంచలనం రేకెత్తించిన మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. పదేళ్ల క్రితం చిత్తూరు మేయర్‌ కఠారి అనురాధ, మోహన్‌ దారుణ హత్యకు గురయ్యారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే వారిని దారుణంగా హతమార్చారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు 23 మందిని నిందితులుగా చేర్చి చార్జిషీట్ ఫైల్ చేశారు.

విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసులు నిందితుడిగా పేర్కొన్న కాసరం రమేశ్ ను ఈ కేసులో నుంచి తప్పించింది. మరో నిందితుడు ఎస్. శ్రీనివాసాచారి మరణించాడు. ఈ హత్యలో మిగతా 21 మంది నిందితుల పాత్రపై కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఇందులో ఐదుగురిని దోషులుగా నిర్ధారిస్తూ చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాసరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. తాజాగా శుక్రవారం ఈ ఐదుగురు నిందితులను ఉరి తీయాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.
 
ఉరిశిక్ష పడిన నిందితులు
  • శ్రీరామ్‌ చంద్రశేఖర్‌ అలియాస్‌ చింటూ (మేయర్‌ భర్త మోహన్‌ మేనల్లుడు)
  • గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్‌ వెంకటేష్‌
  • జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జయారెడ్డి
  • మంజునాథ్‌ అలియాస్‌ మంజు
  • మునిరత్నం వెంకటేష్‌

More Telugu News