నాటి పోస్టుపై క్షమాపణలు చెప్పిన కంగనా రనౌత్

  • 2020-21లో ఢిల్లీలో రైతుల నిరసనలపై కంగనా రనౌత్ పోస్టు
  • మహీందర్ కౌర్ అనే మహిళపై కంగన వ్యాఖ్యలు
  • తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదన్న కంగనా రనౌత్
2020-21లో ఢిల్లీలో రైతుల నిరసనలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారంలో ఆమె క్షమాపణలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో మహీందర్ కౌర్ అనే 73 ఏళ్ల మహిళపై కంగన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహిన్‌బాగ్‌లో నిరసన తెలిపిన బిల్కిస్ బానో, రైతు ఉద్యమంలో పాల్గొన్న మహీందర్ కౌర్ ఇద్దరూ ఒకటేనంటూ కంగన ఒక పోస్టును రీట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో మహీందర్ కౌర్ ఫిర్యాదు మేరకు కంగనపై కేసు నమోదైంది.

ఈ కేసు విచారణ నిమిత్తం కంగనా రనౌత్ నేడు కోర్టుకు హాజరయ్యారు. ఆనాటి పోస్టుకు ఆమె క్షమాపణ కోరారు. తాను కావాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని, జరిగినందుకు చింతిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ కంగన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.


More Telugu News