ఆ జగనన్న అభిమానిపై డీజీపీకి రఘురామ ఫిర్యాదు .. ఎందుకంటే ..?

  • సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులపై రఘురామ సీరియస్
  • డీజీపీకి ఫిర్యాదు చేసిన ఉప సభాపతి రఘురామ 
  • తప్పుడు పోస్టులకు మూలం ఎక్కడుందో గుర్తించేందుకు సమగ్ర విచారణ జరపాలని కోరిన రఘురామ
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెడుతూ కూటమి పార్టీల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శాసనసభ ఉపసభాపతి కె. రఘురామకృష్ణరాజు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు ఫిర్యాదు చేశారు.

వైసీపీ మద్దతుదారుడు ఆంబోజి వినయ్ కుమార్ “జగన్‌ అన్న అభిమాని” పేరుతో తన పేరుతో నకిలీ, ఫ్యాబ్రికేటెడ్ పోస్టులు చేస్తున్నారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. “కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించడమే కాకుండా, వివిధ సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో వినయ్‌కుమార్, మరికొందరు ఈ పోస్టులు పెడుతున్నారు,” అని ఫిర్యాదులో రఘురామ ఉటంకించారు.

తాను ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ గురించి అనని మాటలను చెప్పినట్లు చూపిస్తూ తప్పుడు పోస్టులు సృష్టించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఈ క్రమంలో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడమే కాకుండా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.

రఘురామ ఫిర్యాదులో భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 196 (విద్వేషం రెచ్చగొట్టడం), సెక్షన్‌ 353 (ప్రజలను తప్పుదారి పట్టించడం), సెక్షన్‌ 356 (పరువు నష్టం) కింద కేసు నమోదు చేయాలని కోరారు.

అలాగే, నకిలీ పోస్టుల స్క్రీన్‌షాట్లు, లింకులు ఫిర్యాదుతో రఘురామ జత చేశారు. ఈ పోస్టుల మూలం ఎక్కడుందో గుర్తించేందుకు సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని రఘురామ కోరారు. 


More Telugu News