ఆస్ట్రేలియాలో టీమిండియా దీపావళి.. అడిలైడ్‌లో స్పెషల్ డిన్నర్.. ఇదిగో వీడియో!

  • ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దీపావళి వేడుకలు
  • అడిలైడ్‌లోని భారత రెస్టారెంట్‌లో జట్టు సభ్యుల ప్రత్యేక విందు
  • ఏడు నెలల తర్వాత జట్టుతో చేరిన సీనియర్లు కోహ్లీ, రోహిత్ 
  • విందులో పాల్గొన్న కోహ్లీ, గిల్, శ్రేయస్, తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి
  • సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటగా, భారత క్రికెట్ జట్టు మాత్రం పండుగను ఆస్ట్రేలియాలో జరుపుకుంది. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియా సభ్యులు, ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ పండుగ వాతావరణంలో మునిగిపోయారు. సుమారు ఏడు నెలల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకోవడం విశేషం.

ఆస్ట్రేలియాతో రేపు జరగనున్న రెండో వన్డే మ్యాచ్‌కు ముందు, భారత జట్టు సభ్యులు అడిలైడ్‌లోని ‘బ్రిటీష్ రాజ్’ అనే భారతీయ రెస్టారెంట్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీమ్ డిన్నర్‌కు సంబంధించిన వీడియోను స్థానిక '7న్యూస్ అడిలైడ్' ప్రసారం చేసింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు తెలుగు యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా కనిపించారు. ఆటగాళ్లంతా కలిసి సరదాగా గడుపుతూ పండుగను జరుపుకున్నారు.

మరోవైపు పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ, "ప్రతి ఒక్కరికీ వెలుగులు, నవ్వులు, ప్రేమతో నిండిన దీపావళి శుభాకాంక్షలు" అని పోస్ట్ చేశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా, "అందరికీ సంతోషకరమైన, శ్రేయస్కరమైన దీపావళి. ఈ పవిత్ర పండుగ దీపాలు అన్ని చీకట్లను తొలగించాలి" అని ఆకాంక్షించారు.

వీరితో పాటు బీసీసీఐ, బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. 


More Telugu News