ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అర మార్కు తక్కువొచ్చినా పాసే!

  • ఇంటర్ సైన్స్ విద్యార్థులకు పాస్ మార్కుల్లో అర మార్కు సడలింపు
  • రెండు సంవత్సరాల రాత పరీక్షల్లో 59 మార్కులు వచ్చినా ఉత్తీర్ణతే
  • ఎన్‌సీఈఆర్టీ సిలబస్ అమలుతో పరీక్షా విధానంలో సంస్కరణలు
  • ఫస్టియర్‌లో కొత్తగా ఒక మార్కు ప్రశ్నల ప్రవేశం
  • బోటనీ, జువాలజీ కలిపి ఒకే జీవశాస్త్రం పేపర్‌గా మార్పు
  • ఆరో సబ్జెక్టులో పాసవడం తప్పనిసరి కాదని స్పష్టీకరణ
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యా మండలి శుభవార్త అందించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షా విధానంలో పలు కీలక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రాక్టికల్స్ ఉన్న సైన్స్ సబ్జెక్టుల రాత పరీక్షల్లో అర మార్కు సడలింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల విద్యార్థులు అర మార్కు తేడాతో ఫెయిల్ అయ్యే ఆందోళన తొలగిపోనుంది.

పాస్ మార్కుల్లో కొత్త విధానం ఇదే..
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ వంటి సబ్జెక్టులకు ఈ మార్పు వర్తిస్తుంది. గతంలో ప్ర‌థ‌మ‌, ద్వితీయ‌ సంవత్సరాల రాత పరీక్షల్లో కలిపి ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 59.50 మార్కులు అవసరం కాగా, ఇప్పుడు దాన్ని 59 మార్కులకు తగ్గించారు. అంటే, అర మార్కు తక్కువ వచ్చినా విద్యార్థులను పాసైనట్లుగానే పరిగణిస్తారు. ఈ అర మార్కును సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో సర్దుబాటు చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. దీని ప్రకారం ప్రాక్టికల్స్‌లో పాస్ మార్కును 10.5 నుంచి 11 మార్కులకు పెంచారు.

పరీక్షా విధానంలో మరిన్ని సంస్కరణలు
ఈ సంస్కరణల్లో భాగంగా మొదటి సంవత్సరం పరీక్షల్లో కొత్తగా ఒక మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టారు. అయితే, ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలకు ఎలాంటి ఛాయిస్ ఉండదని స్పష్టం చేశారు. అలాగే, ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న వృక్షశాస్త్రం (బోటనీ), జంతుశాస్త్రం (జువాలజీ) పేపర్లను కలిపి ఒకే జీవశాస్త్రం (బయోలజీ) పేపర్‌గా మార్చారు. ఈ పరీక్షలో వృక్షశాస్త్రం నుంచి 43, జంతుశాస్త్రం నుంచి 42 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.

ఇదిలా ఉండగా, కొన్ని పాత నిబంధనలను యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఏదైనా ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు సాధించి, మిగతా సబ్జెక్టుల్లో 30 శాతం మార్కులు తెచ్చుకున్నా ఉత్తీర్ణులుగా పరిగణించే విధానం కొనసాగుతుంది. ఇక, జాగ్రఫీ సబ్జెక్టు సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని, పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు తెలియజేసింది. అదనంగా గ్రూపులో ఆరో సబ్జెక్టుగా ఎంచుకున్న సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి కాదని, దానికి ప్రత్యేక మెమో జారీ చేస్తామని పేర్కొంది.


More Telugu News