టాటా ట్రస్ట్స్ ట్రస్టీగా వేణు శ్రీనివాస్ పునర్నియామకం... జీవితకాలం కొనసాగేలా ఏకగ్రీవ నిర్ణయం

  • అక్టోబర్ 23న ముగియనున్న శ్రీనివాసన్ పదవీకాలం
  • ఈ నేపథ్యంలో జీవితకాలం కొనసాగేలా నిర్ణయం
  • మెహ్లీ మెస్త్రీ పునర్నియామకంపై అందరి దృష్టి
టాటా ట్రస్ట్స్ ట్రస్టీగా వేణు శ్రీనివాసన్ పునర్నియమితులయ్యారు. ఆయన జీవితకాలం ట్రస్టీగా వ్యవహరించేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. శ్రీనివాసన్ పదవీకాలం అక్టోబర్ 23తో ముగియనున్న నేపథ్యంలో ఆయనను జీవితకాలం కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. టాటా సన్స్ బోర్డులో కొత్త డైరెక్టర్ల నియామకాల అంశంలో టాటా ట్రస్ట్రీలు, మిస్త్రీ కుటుంబానికి మధ్య భిన్నాభిప్రాయలు ఉన్న సమయంలో ఈ నియామకం చోటు చేసుకోవడం గమనార్హం.

అయితే ఈ నిర్ణయంపై టాటా ట్రస్ట్స్ అధికారికంగా వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. మరోవైపు, వేణు శ్రీనివాసన్ నియామకం నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి మిస్త్రీ కుటుంబానికి చెందిన మెహ్లీ మిస్త్రీ పునర్నియామకంపై పడింది. ఆయన పదవీకాలం అక్టోబర్ 28న ముగియనుంది. ఆయన కొనసాగింపుపై అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఉత్కంఠ నెలకొంది.

టాటా ట్రస్ట్స్‌కు దశాబ్దాల పాటు రతన్ టాటా ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన సమయంలో టాటా ట్రస్ట్స్‌కు, గ్రూప్ ప్రధాన సంస్థ టాటా సన్స్‌కు మధ్య మంచి సమన్వయం ఉండేది. రతన్ టాటా మరణానంతరం గత ఏడాది అక్టోబర్‌లో టాటా ట్రస్ట్స్‌కు నోయల్ టాటా ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

టాటా సన్స్‌లో రతన్ తీసుకున్న ఏ నిర్ణయానికి ట్రస్టీలు గానీ, నామినీ డైరెక్టర్లు గానీ అడ్డుపడిన దాఖలాలు లేవు. అయితే ఆ తర్వాత నోయల్ చేసే ప్రతి పనిని ట్రస్టీలు తప్పుబడుతున్నారని సమాచారం. మెహ్లీ మిస్త్రీ కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించారు. టాటా సన్స్ బోర్డులో కొత్త డైరెక్టర్ల నియామకాల అంశంలో ట్రస్టీల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రస్టీల అంశం చర్చనీయాంశమైంది.

Venu Srinivasan
Tata Trusts
Ratan Tata
Noel Tata
Tata Sons
Mehli Mistry

More Telugu News