నర్సరావుపేటలో కాటికాపరి దారుణహత్య.. మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు!

  • నర్సరావుపేటలో కాటికాపరి ఎఫ్రాన్ దారుణ హత్య
  • శ్మశానంలో నిద్రిస్తుండగా గొడ్డళ్లతో కిరాతక దాడి
  • హత్య వెనుక రాజకీయ కక్షలున్నాయని కుటుంబం ఆరోపణ
పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో జరిగిన ఓ కాటికాపరి హత్య రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందని, దీని వెనుక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రోద్బలం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించడం సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. నర్సరావుపేట-రావిపాడు మార్గంలోని స్వర్గపురి-2 శ్మశానవాటికలో ఎఫ్రాన్ అనే వ్యక్తి కాటికాపరిగా పనిచేస్తున్నాడు. రాత్రి శ్మశానంలోనే నిద్రిస్తున్న సమయంలో, గుర్తుతెలియని దుండగులు అతనిపై గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. మెడ, గొంతు భాగాలపై విచక్షణారహితంగా నరకడంతో ఎఫ్రాన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఈ హత్య పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఎఫ్రాన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. క్రిస్టియన్ పాలెంలో నివసించే ఎఫ్రాన్, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేశాడని తెలిపారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే, అదే వార్డుకు చెందిన ఖాదర్, అతని సోదరులు, అనుచరులు ఈ దారుణానికి ఒడిగట్టారని వారు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే అండతోనే ఈ హత్య జరిగిందని ఆరోపణలు గుప్పిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే, ప్రాథమికంగా పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. 

Gopireddy Srinivasa Reddy
Narasaraopet
Palnadu district
murder
political rivalry
TDP
ex MLA
Andhra Pradesh
crime news

More Telugu News