సాధారణ భక్తుడిలా వెళ్లి వెంకటపాలెం వెంకటేశ్వర ఆలయం తనిఖీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
- అమరావతిలోని శ్రీవారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక పర్యటన
- సాధారణ భక్తుడిలా వెళ్లి ఆలయ నిర్వహణ పరిశీలన
- సిబ్బంది తీరు, అలంకరణలో నిర్లక్ష్యాలను గుర్తించిన బీఆర్ నాయుడు
- భక్తి సేవలో లోపాలుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- దేశంలోని అన్ని టీటీడీ ఆలయాల్లోనూ ఇకపై హఠాత్ తనిఖీలు
ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ, "ఈరోజు వెంకటపాలెం ఆలయాన్ని ఆకస్మికంగా సందర్శించాను. సాధారణ భక్తుడిలా దర్శనానికి వెళ్లినప్పుడు ఆలయ నిర్వహణలో కొన్ని నిర్లక్ష్యాలు నా దృష్టికి వచ్చాయి" అని తెలిపారు. స్వామివారి అలంకరణ మొదలుకొని సిబ్బంది ప్రవర్తన వరకు అనేక విషయాల్లో అలసత్వం కనిపించడం తనను ఎంతో బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"భక్తుల సేవలో ఇలాంటి నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని బీఆర్ నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శ్రీవారి ఆలయాలను ఇలాగే ఆకస్మికంగా తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. ఈ తనిఖీల ద్వారా భక్తులకు అందించే సేవల ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని బీఆర్ నాయుడు వివరించారు.