రేపు అల్పపీడనం, ఎల్లుండి వాయుగుండం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
- రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
- 48 గంటల్లో వాయుగుండంగా బలపడి తీరం వైపు పయనం
- వాయుగుండం తుఫాన్గా మారే అవకాశం ఉందని నిపుణుల అంచనా
- రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచన
- కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- ఇప్పటికే నెల్లూరు జిల్లాలో భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయం
వివరాల్లోకి వెళితే... దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలపడనుంది. అనంతరం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని సమీపించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం ముఖ్యంగా రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై అధికంగా ఉంటుందని పేర్కొంది.
ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల కారణంగా ఆదివారం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయి జనజీవనానికి అంతరాయం కలిగింది. నెల్లూరులో 4.9 సెం.మీ., విజయనగరం జిల్లా గొల్లపాడులో 4.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సోమ, మంగళవారాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, బుధవారం నుంచి శుక్రవారం వరకు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇదే సమయంలో విపత్తుల నిర్వహణ సంస్థ కూడా జిల్లాల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, మంగళవారం పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పంట నష్టం జరగకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.