అన్ని థాంక్స్ బాస్ కే చెందుతాయమ్మా!: సిడ్నీలో నారా లోకేశ్

  • ఆస్ట్రేలియా పర్యటనలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్
  • ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం
  • సిడ్నీలో ఇండియా-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం డైరెక్టర్‌తో భేటీ
  • ఆంధ్రప్రదేశ్‌తో వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చ
  • ఈ వారంలోనే సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశానికి సన్నాహాలు
  • సిడ్నీలో టీడీపీ ఎన్నారైలతోనూ సమావేశమైన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. సిడ్నీ నగరంలో అడుగుపెట్టిన వెంటనే ఆయన తన అధికారిక కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. పర్యటనలో భాగంగా తొలిరోజే కీలక సమావేశంలో పాల్గొన్నారు.

ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టగానే ఆయనకు ఓ ఊహించని అభినందన ఎదురైంది. ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఓ చిన్నారి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి కృతజ్ఞతలు తెలిపింది. గూగుల్ ను ఏపీకి తీసుకువచ్చినందుకు థాంక్యూ లోకేశ్ అన్నా అంటూ ఆ చిన్నారి ఓ ప్లకార్డును కూడా ప్రదర్శించింది. 

ఆ పసిమొగ్గ ప్రశంసకు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖామంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఈ ప్రశంసలన్నీ నావి కాదమ్మా.. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడే మన బాస్, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికే చెందాలి" అంటూ వినమ్రంగా బదులిచ్చారు. 

ఒకవైపు ప్రవాసాంధ్రుల ఆత్మీయ పలకరింపులు, మరోవైపు రాష్ట్ర భవిష్యత్తు కోసం కీలక సమావేశాలు.. ఇలా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వరద పారించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన క్షణం తీరిక లేకుండా సాగుతోంది. విమానం దిగిన వెంటనే ఆయన తన అధికారిక కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు.

పెట్టుబడులే లక్ష్యంగా కీలక భేటీ

పర్యటనలో భాగంగా, లోకేశ్ తొలిరోజే సిడ్నీ హార్బర్ వద్ద ఇండియా-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మెక్కేతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆస్ట్రేలియా కంపెనీలకు కీలక పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడమే ధ్యేయంగా ఈ చర్చలు జరిగాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, ప్రభుత్వ పాలసీలను లోకేశ్ ఆమెకు వివరించారు. ఈ భేటీ ఫలవంతంగా ముగిసిందని, త్వరలోనే జోడీ మెక్కే ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరువురూ ప్రధానంగా చర్చించారు.

ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి గణనీయమైన పెట్టుబడులు, సాంకేతిక అవకాశాలు లభిస్తాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News