PP Rajesh: వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ చేసిన సీపీఎం కౌన్సిలర్

PP Rajesh CPM Councilor Arrested for Gold Chain Theft in Kerala
షార్ట్స్‌లో చూడండి
కేరళలో అత్యంత దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రజలకు రక్షణగా, ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రజాప్రతినిధే దొంగగా మారాడు. ఒంటరిగా ఉన్న 77 ఏళ్ల వృద్ధురాలి మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన కేసులో అధికార సీపీఎం పార్టీకి చెందిన సిట్టింగ్ కౌన్సిలర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. కన్నూర్ జిల్లా కూతుపరంబ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు కౌన్సిలర్‌గా పి.పి. రాజేష్ పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం, జానకి అనే 77 ఏళ్ల వృద్ధురాలు తన ఇంట్లో ఒంటరిగా వంటగదిలో పని చేసుకుంటున్నారు. ఇంటి ముందు తలుపు తెరిచి ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి హెల్మెట్ ధరించి అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించాడు. ఆమె తేరుకునేలోపే మెడలోని ఒక సవర బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.

బాధితురాలి కేకలతో చుట్టుపక్కల వారు వచ్చేసరికే దొంగ పారిపోయాడు. నిందితుడు హెల్మెట్ ధరించి ఉండటంతో అతడిని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు, సమీపంలోని ఇళ్లు, దుకాణాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుటేజీలో కనిపించిన వాహనం ఆధారంగా దర్యాప్తు చేయగా, ఈ నేరానికి పాల్పడింది స్థానిక కౌన్సిలర్ రాజేష్ అని తేలడంతో పోలీసులు సైతం విస్తుపోయారు.

రెండు రోజుల పాటు విచారణ జరిపిన అనంతరం శనివారం రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. నిందితుడి నుంచి చోరీకి గురైన బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని, బాధితురాలు జానకికి తిరిగి అప్పగించారు. ఈ ఘటన సీపీఎంకు కంచుకోటగా భావించే కన్నూర్ జిల్లాలో జరగడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కౌన్సిలర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజేష్‌ను త్వరలో కోర్టులో హాజరుపరచనున్నామని, ఇలాంటి ఇతర కేసుల్లో అతడి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Go Back to Shorts
PP Rajesh
Kerala
CPM
Kannur
Councilor
Gold chain theft
Janaki
Kuthuparamba Municipality
Crime
Robbery

More Telugu News