బీఎస్ఎన్ఎల్ దీపావళి క్రేజీ ఆఫర్.. ఒక్క రూపాయికే సిమ్, రోజూ 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్

  • బీఎస్ఎన్ఎల్ 'దీపావళి బొనాంజా 2025' పేరుతో కొత్త ఆఫర్
  • కొత్త కస్టమర్లకు రూపాయికే 4G సిమ్ కార్డు
  • నెల రోజుల వ్యాలిడిటీ, రోజూ 2GB హై-స్పీడ్ డేటా
  • అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ సౌకర్యం
  • నవంబర్ 15 వరకు అందుబాటులో ఆఫర్ 
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఓ సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే కొత్త 4జీ సిమ్ కార్డుతో పాటు నెల రోజుల పాటు అపరిమిత సేవలను అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీగా, కొత్త కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది.

‘దీపావళి బొనాంజా 2025’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కింద, కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో చేరే వినియోగదారులు రూపాయి చెల్లించి 4జీ సిమ్ పొందవచ్చు. ఈ ప్లాన్‌కు 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ నెల రోజుల పాటు, వినియోగదారులు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, రోజూ 2 జీబీ చొప్పున మొత్తం 60 జీబీ హై-స్పీడ్ 4జీ డేజటాను కూడా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. అక్టోబర్ 15న ప్రారంభమైన ఈ ఆఫర్, నవంబర్ 15, 2025 వరకు కొనసాగుతుంది. కొత్త సిమ్ కార్డు పొందాలనుకునే వారు అవసరమైన కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. 30 రోజుల ఆఫర్ గడువు ముగిసిన తర్వాత, వినియోగదారులు తమకు నచ్చిన సాధారణ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు మారాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రయత్నించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశమని టెలికాం నిపుణులు విశ్లేషిస్తున్నారు. 


More Telugu News